Friday, November 27, 2009

ద్వాదశ జ్యోతిర్లింగాలు

కైలాసంలో కొలువైన మహా శివుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం. ఇంతటి మహత్యం కలిగిన ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశం మొత్తం మీద 12 ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కొలువైన ఆ పరమశివుడు భక్తుల ప్రార్ధనలు ఆలకించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని ప్రతీతి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
సౌరాష్ట్రలోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు శివపురిలోని ఓంకారేశ్వరుడు వారణాసిలోని కాశీవిశ్వేశరుడు, దేవఘర్‌లోని వైద్యనాథుడు, కేదారనాథ్‌లోని కేదారేశ్వరుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, ఔరంగాబాద్‌లోని ఘృష్ణేశ్వరుడు, నాసిక్‌లోని త్రయంబకేశ్వరుడు, రామేశ్వరంలోని రామేశ్వరుడు, మంచార్‌లోని భీమశంకరుడుల దేవాలయాలను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పేర్కొంటారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు... సంక్షిప్తంగా






సౌరాష్ట్ర... సోమనాధ క్షేత్రం
గుజరాత్‌కు ఆగ్నేయంగా అరేబియా సముద్ర తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట ఈ ఆలయం నిర్మితమైంది. పురాణపరంగా ఈ దేవాలయాన్ని చంద్రదేవుడు సోమ నిర్మించాడని ప్రతీతి. ఆయన తర్వాత మరెందరో పురాణ పురుషులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం 1950 ప్రాంతంలో నిర్మించబడింది.

శ్రీశైలం... మల్లికార్జునుడి క్షేత్రం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కృష్ణానది తీరాన రేషబాగిరి కొండలపై కొలువైన ఈ క్షేత్రం దట్టమైన అడవుల్లో ఉంది. ఈ ఆలయాన్ని 1404లో హరిహరరాయులు నిర్మించారని ప్రతీతి. శ్రీశైలంలో మల్లికార్జునుడి సమేతంగా కొలువైన అమ్మవారి పేరు భ్రమరాంభికాదేవి. మహిషాసురుడిని సంహరించడం కోసం అమ్మవారు భ్రమరం రూపం దరించారని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఉజ్జయిని... మహాకాళేశ్వర క్షేత్రం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ సరస్సు ఒడ్డున మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఐదంతస్థులుగా నిర్మించబడిన ఈ దేవాలయంలో మొదటి అంతస్థు భూగర్భంలో ఉండడం విశేషం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ క్షేత్రంలో తాంత్రిక సాంప్రదాయం కన్పించడం మరో విశేషం.
శివపురి... ఓంకారేశ్వర క్షేత్రం
మధ్యప్రదేశ్‌లోని మాంధాత ద్వీపకల్పంలో నర్మదా, కావేరి నదుల సంగమ ప్రదేశంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. శివాలయాలకు నెలవైన ఈ ద్వీపకల్పం సహజంగానే ఓంకార రూపంలో ఉండడం విశేషం.

వారణాసి... కాశీవిశ్వేశర క్షేత్రం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ పట్నంలో విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించారు.

దేవఘర్... వైద్యనాథ క్షేత్రం
జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ చిన్నపట్నం. రావణుడు లంకకు తీసుకువెళ్లాలనుకున్న ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టి తిరిగి తీసుకువెళ్లలేక పోయాడన్నది పురాణ గాథ.

కేదారనాథ్... కేదారేశ్వర క్షేత్రం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ క్షేత్రం హిమాలయాల్లో ఉంది. రుద్ర హిమాలయాల శ్రేణిలో ఉన్న ఈ దేవాలయంలోకి ఏడాదిలో ఆర్నెళ్లు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

ద్వారక... నాగేశ్వరుడి క్షేత్రం
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, బెట్‌ద్వారక ద్వీపకల్పాల మధ్య నాగేశ్వర్ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించినవారు విషం నుంచి విముక్తి పొందుతారన్నది భక్తుల విశ్వాసం.

ఔరంగాబాద్... ఘృష్ణేశ్వరుడి క్షేత్రం
మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్‌లో ఈ క్షేత్రం కొలువై ఉంది. తన భక్తురాల ఘృష్ణ కోరిక మేరకు శివుడు ఈ క్షేత్రంలో వెలిశాడని పురాణ గాథ.

నాసిక్... త్రయంబకేశ్వరుడి క్షేత్రం
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలవై ఉంది. ఈ దేవాలయంలోని మూడు లింగాలు త్రయంబకేశ్వర్‌కు అంకితమై కన్ను ఆకారంలో ఉండడంవల్ల ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది.

రామేశ్వరం... రామేశ్వరుడి క్షేత్రం
తమిళనాడులోని రామేశ్వరంలో వెలసిన ఈ క్షేత్రాన్ని రామాయణ కాలం నాటిదిగా పేర్కొంటారు.

మంచార్... భీమశంకరుడి క్షేత్రం
మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఈ భీమ శంకర క్షేత్రం ఉంది. భీమా అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడి దేవాలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది.

పైన పేర్కొన్న 12 జ్లోతిర్లింగ క్షేత్రాలను దర్శిస్తే జన్మ సార్థకం అవుతుందని శైవ భక్తుల విశ్వాసం.

అంగ్‌కోర్ వాట్ దేవాలయం

భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కంబోడియాలోని "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.

కంబోడియా జాతీయ పతాకంలో కూడా చోటు దక్కించుకున్న అంగ్‌కోర్ వాట్.. ప్రపంచ ఆధునిక నాగరికతల్లో ఒకటిగా చెప్పబడే "ఖ్మేర్" సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు.. రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి.




కంబోడియాలోని "సీమ్ రీప్" అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది "అంగ్‌కోర్ వాట్" దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.

"టోనెల్ సాప్" సరస్సు తీరాన, 200 చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ప్రదేశంలో.. "కులేన్" పర్వత శ్రేణుల పాదాలవద్ద అంగ్‌కోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగానే కాకుండా.. అతిపెద్ద మహావిష్ణుదేవాలయంగా కూడా పేరు సంపాదించింది.

అంగ్‌కోర్ వాట్.. చాలా దేవాలయాల సముదాయం. పురాతన కాలంలోనే ఖచ్చితమైన కొలతలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ పనివిధానంతో ఈ ఆలయాన్ని రూపొందించటం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ సాంప్రదాయ అస్థిత్వం ఉండే భారత ఉపఖండంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదని చెబితే అతిశయోక్తి కాదు.
ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు సుమారు 30 సంవత్సరాల కాలం పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దేవాలయ నిర్మాణం.. అచ్చం తమిళనాడులోని దేవాలయాలను పోలి ఉండటం విశేషం. తమిళ చోళ రాజుల కాలంనాటి నిర్మాణ పద్ధతులు అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో గోచరిస్తూ ఉంటాయి. అదీ.. ఖ్మేర్ సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఇతర దేవాలయాలకు కాస్త భిన్నంగా.. అంగ్‌కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది.

ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవికావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాటిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట.. ఇదే టెక్నాలజీని అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో వాడారు.

ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది. 5 మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు విశాలంతో నిర్మితమైన "బారే" (రిజర్వాయర్లు)లు ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరుకు అద్దంపట్టేలా దర్శనమిస్తున్నాయి.

అదలా ఉంచితే.. ఈ ఆలయ సందర్శనం జీవితంలో ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుందటే ఆశ్చర్యపడాల్సింది లేదు. పచ్చగా పరచుకున్న పరిసరాలలో మమేకమవుతూ... మెకాంగ్ నదీమార్గం గుండా పడవలో ప్రయాణిస్తూ చేసే ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకమవుతుంది. వియత్నాంలోని చావూ డాక్ నుంచి బయల్దేరి కంబోడియా రాజధాని "నోమ్ పెన్" మీదుగా సీమ్ రీప్ చేరుకోవచ్చు

అంగ్‌కోర్ వాట్ దేవాలయం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లగానే పచ్చదనంతో కూడిన పరిసరాలు హాయిగా స్వాగతం పలుకుతాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా దర్శనమిచ్చేవి అద్భుతంగా నిర్మితమైన మూడు ఆలయ గోపురాలు. మధ్య గోపురం నుంచి ప్రయాణిస్తే.. అనేక గోపురాలు దర్శనమిస్తాయి.

ఈ ఆలయంలో ప్రత్యేకంగా సూర్యోదయం గురించి చెప్పుకోవాల్సి ఉంది. సూర్యోదయం వేళలో ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. గోపుర ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే.. గోపురం చాటు నుంచీ దోబూచులాడుతూ కిందకు జాలువారే ఉదయభానుడి లేలేత కిరణాలు ఓ అద్భుతమైన సుందర దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవనిపిస్తుంది.

భారతదేశంలోగల అన్ని హిందూ ఆలయాలకుమల్లే అంగ్‌కోర్ వాట్‌ గోడలపై కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలోని మరో అద్భుత ప్రదేశం "బ్యాస్ రిలీఫ్స్" గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మితమైన ఈ మంటపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలు కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పువైపున ఉండే "మంటన్" గ్యాలరీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రామాయణ, మహాభారత దృశ్యాలు.. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథన దృశ్యాలు అందర్నీ అబ్బురపరుస్తాయి.

ఆలయం తూర్పున పుట్టుక, అవతారాల గురించిన శిల్పాలు, పశ్చిమాన ఉండే మంటపం గోడలపై యుద్ధాలు, మరణాల గురించిన ఆకృతులు లో దర్శనమిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ-రావణ యుద్ధంలాంటి అద్భుత సంఘటనలు సైతం ఈ గోడలలో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక దక్షిణ మంటంలో రెండవ సూర్యవర్మన్ సైనిక పటాలం.. మహామునులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభలాంటి అనేక కళాఖండాలు ఆయల గోడలపై సాక్షాత్కరిస్తాయి.

అంగ్‌కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అద్భుత ప్రదేశం "అంగ్‌కోర్ థోమ్". ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తులలో ఒకరైన జయవర్మన్-6 ఈ థోమ్‌ను రాజధానిగా పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. దీన్నే "గ్రేట్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

ఈ థోమ్‌లో కూడా అనేక పురాణ కళాకృతులు మన చూపును మరల్చనీయవు. ముఖ్యంగా బౌద్ధమత సంస్కృతి ఉట్టిపడేలా ఉండే ఈ ఆలయంలో ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోల్డెన్ టవర్ (బెయాన్) చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మితమైన ఈ బెయాన్‌ అంగ్‌కోర్ థోమ్‌కే ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఇక చివరిగా చెప్పుకోవాలంటే.. ఖ్మేర్ సామ్రాజ్య పురాణ గాథల ఆధారంగా చూస్తే... ఖ్మేర్ సామ్రాజ్యాధినేత "కాము"తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ ఖ్మేర్ నాగరికత తరువాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంబోడియాకు వ్యాపించి.. సంస్కృతం అధికార భాషగా.. హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయట. కాబట్టి భారత సంస్కృతిని అణువణువునా నింపుకున్న ఈ అద్భుత కట్టడాలను జీవితంలో ఒక్కసారయినా దర్శించుకుంటే జీవితం ధన్యమైనట్లే..!

Saturday, November 21, 2009

వేదమాతరం

హైందవీ సంస్కృతీ వేద... భారతీ మాతృ శారదా |
శక్తిం ప్రదాతుమే వేద... భారతీ సుప్రకాశమే||

వేదోఖిల జగస్సర్వం నమామి వేదమాతరం

వేదాన్ని జీవన సంవిధానంగా మార్చుకున్న జాతి మనది. వేటగాడిని వేదర్షి వాల్మీకిని చేసిన చరిత మనది. వెన్నెముకను వజ్రాయుధంగా మలచిన యుక్తి మనది. గడ్డిపోచను ఆత్మబలంతో అస్త్రంగా తీర్చిదిద్దిన శక్తి మనది. భగవంతుడే జగద్గురువై 'గీత' మార్చిన రాత మనది. శూన్యం(సున్నా)తో గణాంకాలు రాశులు పోసిన ఘనత మనది. మూడుపదులకే ప్రపంచాన్ని మురిపించిన 'వివేకం' మనది. పోపులడబ్బాలో ఆయుర్వేద సారాన్ని కూర్చిన నైపుణ్యం మనది. అమ్మ చేతిలోనే అమృత వైద్యం అందించిన అద్భుతం మనది.

వాకిట్లో చల్లే కళ్లాపి, ఇంటి ముందటి వేపచెట్టు, గుమ్మానికి కట్టిన తోరణం, పెరట్లో పెరిగిన తులసి మొక్క, వంటింట్లో నలిగిన పసుపు, కాళ్లకు పెట్టుకునే వెండి పట్టీలు,దొడ్లో ఉండే ఆవుపాలు..మనం వాడే ప్రతిదీ ఔషధమే! అద్భుతమే! అమృతమే!

ఒకరికొకరుగా బతికే గ్రామీణ జీవన విధానం, పెద్దా చిన్నా కలసి పెరిగే సమిష్టి కుటుంబం, భయభక్తులు నేర్పే గురుకుల విద్య అబ్బురపరచే ఆధ్యాత్మిక సంపద, ప్రకృతిని పూజించే పండగలు, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే కళారూపాలు, ఎవరిమీదా ఆధారపడకుండా కడుపు నింపే చేతి వృత్తి, ఉర్రూతలూపే జానపదం, తేనెలూరే తెలుగు, ఆధునిక కంప్యూటర్ కూ సరిపోయే అతి ప్రాచీన సంస్కృతం, ఎంత గొప్పది మన వారసత్వం?

aaryoktulu

యథావృక్షస్య సంపుష్టితస్య దూరాత్ గంధోవాత్యేవం
పుణ్యస్యకర్మణో దూరాత్ గంధోవాతి!
పుష్పించిన వృక్షం సువాసన ఎలా చాలా దూరం వరకు వ్యాపిస్తుందో, అదే విధంగా పవిత్రమైన కర్మల ప్రభావం చాలాదూరం వరకు వ్యాపిస్తుంది. -వేదవాక్యం
అపిస్వర్ణమయీ లంకా/నమే లక్ష్మణ రోచతే!
జననీ జన్మభూమిశ్చ/స్వర్గాధపి గరీయసీ!
పూర్తిగా బంగారంతో నిండి ఉన్నప్పటికీ ఈ లంకా నగరం ఇంపుగా కనిపించడం లేదు. అమ్మ, మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి. -రామాయణం
యోన్యథా సంతమాత్మానం/అన్యథా ప్రతిపద్యతే!
కింతేన నకృతం పాపం/చోరేణాత్మానుసారిణా!
మానవుడు చేసే ప్రతి పనినీ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువులు, భూమాత, వరుణుడు, అంతరాత్మ, యముడు, పగలు, ధర్మదేవత మొదలైనవారు గమనిస్తుంటారు. అబద్ధమాడి వారిని వంచించడం ఎవరి తరమూ కాదు. -మహాభారతం
ఉద్ధరేత్ ఆత్మనాత్మానం
న ఆత్మానం అవసాదయేత్
ఆత్మైవ హి ఆత్మనో బంధు
ఆత్మైవ రిపుః ఆత్మనః
మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను దిగజార్చుకోగూడదు. ఎందుకంటే మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. -భగవద్గీత
అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి
మూర్ఖవదుపేక్షణీయః
సకల శాస్త్రములూ తెలిసిన వాడైనా... సంప్రదాయం పాటించని వాడు మూర్ఖుడితో సమానం -ఆది శంకరాచార్య.
దేహోదేవాలయః ప్రోక్తో జీవోదేవః సనాతనః
శిఖరం శిర ఇత్యాహుఃగర్భగేహం గళస్తథా
మంటపం కుక్షిరిత్యాహుః ప్రాకారం జానుజంఘకం
గోపురం పాద ఇత్యాహుః ధ్వజో జీవిత ముచ్యతే!
దేహమే దేవాలయం. అందులోని జీవుడే దేవుడు. శిఖరం శిరస్సు. గర్భగుడి మెడ. మంటపం ఉదరం. ప్రాకార కుడ్యాలు కాళ్లు. రాజ గోపరం పాదాలు. ధ్వజ స్తంభం జీవితం. -ఆర్యోక్తి
భారతీయులనెవరూ విధ్వంసం చేయలేరు. వారు మృత్యుంజయులు. ఆత్మ తత్వాన్నే ఆదర్శంగా చేసుకుని, ఆధ్యత్మికతను విడువనంతకాలం వరకు వారు అమరులై వెలుగొందుతారు. భారతీయతలోనే అన్ని శక్తులూ ఇమిడి ఉన్నాయి. అయితే భారతీయులు తమ చేతుల్ని తమ కళ్లకు అడ్డుపెట్టుకున్నారు. తాము చీకట్లో ఉన్నామని భ్రమపడుతున్నారు.-వివేకానందస్వామి.
మనం తూర్పున ఉన్నాం. పశ్చిమం వైపు చూస్తున్నాం. సూర్యుడు మన వద్దే, మన వెనకే ఉదయిస్తున్నాడు. కానీ దాన్ని మనం గమనించడం లేదు. పాశ్చాత్యులు చూపిస్తున్న అద్దంలో కనిపించే సూర్యుడిని చూసి అక్కడే ఉదయిస్తున్నాడని భ్రమపడుతున్నాం. -సామవేదం

విదేశాలలో భారతీయ సంస్కృతి




భారతీయ సంస్కృతి ప్రంపంచంలోని అనేక దేశాల్లో వ్యాపించింది. భారతీయ ఆచారాలు, నాగరికతకు ఆయా దేశాలు పట్టం కట్టాయనే చెప్పవచ్చు.
బర్మా దేశాన్ని పూర్వం సువర్ణభూమి అని పిలిచేది. ఇక్కడి శిల్పాల్లో బౌద్ధ,శైవ,వైష్ణవ ప్రతిమలున్నాయి. వీరి న్యాయ శాస్త్రం నారద,మనువు, యాగ్నవల్క్య బోధనల ఆధారంగా వెలిసింది.
ఇండోనెషియాలోని జావా ద్వీపంలో లభించిన శాసనాలు సంస్కృతంలో దేవనాగరి లిపిలో ఉన్నవి. అంతేకాదు,, బేయాన్ నగరంలో ఉన్న ఎనిమిది దేవాలయాలలో విష్ణు,శివ,గణేష,దుర్గ,యమ విగ్రహాలున్నవి.
అమెరికా ఖండంలోని మెక్సికో దేశంలో హిందూ నాగరికత విలసిల్లింది. ఇక్కడ ఒక సూర్య దేవాలయమున్నది. అంతేకాదు.. ఇక్కడే గణేష ప్రతిమలు లభించాయి.
అఫ్ఘనిస్తాంకు పూర్వం గాంధార దేశమని పేరు. గజినీ నగరంలో జరిగిన తవ్వకాలలో విష్ణు విగ్రహాలు బయటపడ్డాయి.ఇక్కడి ప్రజలు మాట్లాడే పుస్తూ భాషలో అనేక సంస్కృత పదాలున్నాయి.
జపాన్లోని కియాటో నగరంలో యముని దేవాలయమున్నది.దున్నపోతునెక్కిన యముణ్ణి ఇక్కడ చూడవచు.ఈ ప్రాంతం వారు యముణ్ణి యెమ్మాశ్వాన్ అని పిలుస్తారు.